South Central Railway: ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే!

పండగ సీజన్ లో రద్దీని తట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేకరైళ్లను మరికొంత కాలం పాటు పొడిగించనున్నామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రస్తుతం 14 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండగా, మరో 12 రైళ్లను దసరా - దీపావళి సీజన్ లో నడుపుతున్న రైల్వే శాఖ వాటిని డిసెంబర్ నెలాఖరు వరకూ, అయ్యప్ప భక్తుల శబరిమల యాత్ర కోసం మరో రెండు రైళ్లను సికింద్రాబాద్ - త్రివేండ్రం మధ్య జనవరి 20 వరకూ నడుపుతామని పేర్కొంది.

పొడిగించిన రైళ్ల వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ - విశాఖపట్నం - హైదరాబాద్, సికింద్రాబాద్ - విశాఖపట్నం - సికింద్రాబాద్, లింగంపల్లి - కాకినాడ టౌన్ - లింగంపల్లి, హైదరాబాద్ - న్యూ ఢిల్లీ - హైదరాబాద్, హైదరాబాద్ - ముంబై - హైదరాబాద్, తిరుపతి - నిజామాబాద్ - తిరుపతి, తిరుపతి - విశాఖపట్నం - తిరుపతి రైళ్లను పొడిగించామని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ ఈ రైళ్లు కొనసాగుతాయని ఓ ప్రకటనలో తెలిపింది.

ఇక డిసెంబర్ నెలాఖరు వరకూ పొడిగించిన రైళ్లలో తిరుపతి - లింగంపల్లి - తిరుపతి, నర్సాపూర్ - లింగంపల్లి - నర్సాపూర్, హైదరాబాద్ - తాంబరం - హైదరాబాద్, హైదరాబాద్ - ఔరంగాబాద్ - హైదరాబాద్, తిరుపతి - అమరావతి - తిరుపతి రైళ్లు ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి త్రివేండ్రం మధ్య తిరిగే రైలును జనవరి 20 వరకూ పొడిగించామని వెల్లడించింది.
South Central Railway
Secunderabad
Special Trains

More Telugu News