చినరాజప్పను గృహ నిర్బంధం చేసిన పోలీసులు.. మండిపడ్డ నేత

  • అమరావతి పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా నిరసనలు
  • ‘చలో గుంటూరు’కు టీడీపీ నేతలు
  • టీడీపీ నేతలు, కార్యకర్తలను నిర్బంధించడం సరికాదన్న చినరాజప్ప
  • గృహ నిర్బంధాలతో అమరావతి ఉద్యమాన్ని అపలేరని వ్యాఖ్య
అమరావతి పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా, వైసీపీ ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా ‘చలో గుంటూరు’ పిలుపుమేరకు నిరసనలు తెలపడానికి వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేటలో టీడీపీ నేత చినరాజప్పను గృహ నిర్బంధం చేశారు.

దీంతో ఆయన ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతూ.. టీడీపీ నేతలు, కార్యకర్తలను నిర్బంధించడం సరికాదని చెప్పారు. గృహ నిర్బంధాలతో అమరావతి ఉద్యమాన్ని అపలేరని అన్నారు. కాగా, చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కుప్పంలో హంద్రీనీవా ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని టీడీపీ నాయకులు చేపట్టిన ఆందోళనను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆయన మండిపడ్డారు.

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీతో పాటు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజలను టీడీపీ కార్యాలయంలోనే నిర్బంధించారు. మరోవైపు విజయవాడలో మొగల్రాజపురంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత శివారెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేశారు.

అంతేగాక, కాకినాడ గ్రామీణంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని హౌస్ అరెస్టు చేశారు. భీమవరంలో మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని గృహ నిర్బంధం చేశారు. గుంటూరులోని పెదపరిమి-తాడికొండ అడ్డరోడ్డు వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి, వాహనాలను తనిఖీ చేస్తున్నారు.


More Telugu News

Nimmakayala Chinarajappa Telugudesam amrnath reddy