బీజేపీ ఘన విజయం ఖాయం.. నాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు: కిషన్ రెడ్డి

  • తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేశాను
  • కేంద్ర నిధులపై టీఆర్ఎస్ ది తప్పుడు ప్రచారం
  • టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే
దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ నేతలు గెలుపే లక్ష్యంగా ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ టీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలను సంధించారు.

తెలంగాణ రాష్ట్రం కోసం తాను కూడా ఎన్నో ఉద్యమాలను చేశానని... ఆ ఉద్యమాల్లో టీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొన్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తానేంటో ప్రజలకు తెలుసని, తనకు ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

దుబ్బాక ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. ఉపఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని... ఆ పార్టీలకు ఓటు వేయడం వల్ల ఉపయోగం లేదని అన్నారు. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని గెలిచేందుకు టీఆర్ఎస్ యత్నిస్తోందని చెప్పారు. ఓటర్లను ప్రలోభపెట్టి లబ్ధిపొందాలని చూస్తోందని మండిపడ్డారు. దుబ్బాకను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని అన్నారు.

Kishan Reddy
BJP
TRS
Congress
Dubbaka

More Telugu News