Chirag: చిరాగ్ కు పెద్ద పదవి ఇవ్వాలనుకున్నాం... నమ్మకాన్ని నిలుపుకోలేదన్న సుశీల్ మోదీ!

  • రోజుకో మలుపు తిరుగుతున్న బీహార్ రాజకీయాలు
  • చిరాగ్ తో పొత్తుకు చివరి వరకూ ప్రయత్నించాం
  • గెలిచేది తామేనన్న సుశీల్ కుమార్ మోదీ
Suseel Modi Fires on Chirag Paswan

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకొంత సమయం ఉండగానే, రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి కూడా, బీహార్ లో జేడీ(యూ), బీజేపీ పొత్తును కాదని ఒంటరిగా పోటీకి దిగాలని నిర్ణయించుకున్న ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్, రెండు రోజుల క్రితం చేసిన ప్రకటనపై బీహార్ బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోదీ తీవ్రంగా స్పందించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల తరువాత బీహార్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నితీశ్ కుమారేనని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీయే గెలిస్తే, చిరాగ్ కు ఓ పెద్ద పదవి ఇవ్వాలని తాము అనుకున్నామని, కానీ ఆయన తనపై ఉంచుకున్న బీజేపీ నమ్మకాన్ని వమ్ము చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.

'ఎటువంటి సందేహం లేదు... బీహార్ కు నితీశ్ కుమారే సీఎం" అని తాజా మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. నితీశ్ కుమార్ క్యాబినెట్ లో సుశీల్ డిప్యూటీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. 74 సంవత్సరాల వయసులో ఉన్న రామ్ విలాస్ పాశ్వాన్ కు ఇటీవల హార్ట్ సర్జరీ జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చిరాగ్ తో పొత్తు పెట్టుకునేందుకే తాము చివరి క్షణం వరకూ ప్రయత్నించామని అయితే, అందుకు ఆయనే ఒప్పుకోలేదని అన్నారు.

కాగా, ఇటీవలి కాలంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై పలు అంశాల్లో చిరాగ్ పాశ్వాన్ విభేదిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆయన ఎన్డీయే భాగస్వామిగా ఉన్నందున బీజేపీ కూడా ప్రశ్నించలేదు. ఈ విషయంలో నితీశ్ వర్గం నుంచి బీజేపీకి విమర్శలూ ఎదురయ్యాయి. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న వేళ, బీజేపీ, జేడీ (యూ) మధ్య సీట్ల పంపిణీ కూడా పూర్తయింది. ఈ రెండు పార్టీలతో పాటు జతిన్ రామ్ మాంజీ నేతృత్వంలోనే హెచ్ఏఎం, వికాస్ శీల్ నేతృత్వంలోని ఇన్సాన్ పార్టీలు మాత్రమే కూటమిగా ఉంటాయని సుశీల్ కుమార్ వెల్లడించారు.

More Telugu News