Karanam Balaram: జగన్ గాలిలోనే గెలవలేకపోయాడు: ఆమంచిపై కరణం బలరాం ఎద్దేవా

తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీ గూటికి చేరిన తర్వాత చీరాల నియోజకవర్గం రాజకీయాలు మరింత వేడెక్కాయి. చీరాలలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం ఇద్దరూ ఫ్యాన్ కిందకు రావడంతో వైసీపీలో ఆధిపత్య పోరుకు తెరలేచింది.

గత ఎన్నికల్లో ఓడిపోయినా నియోజకవర్గంలో ఆమంచి మాటే చెల్లుబాటు అయింది. నాలుగు నెలల క్రితం బలరాం వైసీపీ గూటికి చేరడంతో... నేతల మధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మరోవైపు తాజాగా ఆమంచిని ఉద్దేశిస్తూ బలరాం చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో వేడిని పెంచాయి.

జగన్ గాలిలో కూడా టీడీపీ అభ్యర్థిని జనాలు మెజార్టీతో గెలిపించారంటే... అవతలి వ్యక్తిపై ఉన్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని బలరాం అన్నారు. పనుల కోసం వచ్చే వారితో ప్రజాప్రతినిధులు మంచిగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలని అన్నారు. ఎన్నికలలో ఓట్లు వేయలేదనే కారణంతో కొందరిని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతల విషయంలో చీరాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఎవరో ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తే తాను చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు.
Karanam Balaram
Amanchi Krishna Mohan
YSRCP
Chirala

More Telugu News