ప్రధాన రహదారులే ఇలా ఉన్నాయి.. మిగిలిన రోడ్ల పరిస్థితి ఏమిటి?: దేవినేని ఉమ

ఆంధ్రప్రదేశ్‌లోని రహదారులపై పడిన గుంతల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, ఏపీ సర్కారు పట్టించుకోవట్లేదంటూ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.

'శిథిలమై శకలమవుతున్న ఫ్లైఓవర్, రోడ్లపైనే కాదు ఫ్లైఓవర్ లపైనా అడుగడుగునా గుంటలు, నేషనల్ హైవేలకు అనుసంధానించే ప్రధాన రహదారులే ఇలా ఉంటే మిగిలిన రోడ్ల పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో ఆర్అండ్‌బీ, పంచాయతీరాజ్ కి రోడ్ల పరిస్థితి కనబడుతుందా? 15 నెలల్లో రోడ్లకు, మరమ్మతులకు ఎంత ఖర్చుపెట్టారో చెప్పండి వైఎస్ జగన్ గారూ' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

కాగా, విజయవాడ-విస్సన్నపేట రహదారిపై వెలగలేరు హైస్కూల్ వద్ద భారీ గుంతలు పడ్డాయని, విజయవాడలోని చనుమోలు వెంకట్రావు ఫ్లైవోవర్‌ (సీవీఆర్‌)పై కూడా ఇదే పరిస్థితని ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన కథనాన్ని దేవినేని ఉమ పోస్ట్ చేశారు. విజయవాడ-విస్సన్నపేట రహదారిపై వెలగలేరు హైస్కూల్ వద్ద భారీ గుంతలు పడడంతో నిన్న టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఆ గుంతల్లో స్థానికులు నాట్లు వేసి నిరసన తెలిపారు. వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి ఇదేనా? అంటూ టీడీపీ నేతలు ఆ సందర్భంగా ఎద్దేవా చేశారు.


More Telugu News