మీది ప్రజాపాలనా? లేక రాచరికమా?: సీఎం జగన్ ను ప్రశ్నించిన వర్ల రామయ్య

  • ఈఎస్ఐ కొనుగోళ్ల వ్యవహారంలో అచ్చెన్నాయుడు అరెస్ట్
  • అచ్చెన్నను ఆసుపత్రిలోనే విచారిస్తున్న ఏసీబీ
  • కక్ష సాధింపులో భాగమేనంటూ వర్ల రామయ్య ట్వీట్
ఈఎస్ఐ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏసీబీ అధికారులు ఆసుపత్రిలోనే అచ్చెన్నాయుడిని విచారిస్తున్నారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య స్పందించారు.

మాజీ మంత్రి, బీసీ నేత అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేయడం నుంచి వైద్యం అందించడం, కస్టడీలో విచారణ అంతా మీ కక్ష సాధింపులో భాగంగా జరుగుతున్నదే కదా? అంటూ ప్రశ్నించారు. మీ పాలనలో మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లకు ఈ గతే పడుతుంది అని హెచ్చరించడమే కదా? అంటూ ట్వీట్ చేశారు. మీది ప్రజాపాలనా? లేక రాచరికమా? అంటూ వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సీఎంగా రాజ్యాంగబద్ధ పాలన మీ బాధ్యత అని గుర్తు చేసుకోండి అంటూ హితవు పలికారు.

Varla Ramaiah
Atchannaidu
Jagan
ESI Scam
ACB
Andhra Pradesh

More Telugu News