Telangana: నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. అసెంబ్లీలో ప్రారంభమైన వేడుకలు

Today Telangana Formation day
  • అసెంబ్లీలో జాతీయ జెండాలు ఎగురవేసిన పోచారం, గుత్తా 
  • తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను కేసీఆర్ నెరవేర్చారన్న స్పీకర్
  • మరికాసేపట్లో గన్‌పార్క్‌లో అమరులకు కేసీఆర్ నివాళి
నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు.

అనంతరం శాసనసభ వద్ద పోచారం, శాసనమండలి వద్ద గుత్తా జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను కేసీఆర్ నెరవేర్చారన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం తామంతా నిరంతరం కృషి చేస్తున్నట్టు చెప్పారు.

మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాలు మొదలయ్యాయి. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. మరికాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. అనంతరం ప్రగతి భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
Telangana
Telangana Formation Day
KCR

More Telugu News