India: ఇండియాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ... మీడియాను దూరం పెట్టిన కేంద్రం!

No Official Information on Corona from Govt
షార్ట్స్‌లో చూడండి
కరోనాపై ఏదైనా సమాచారాన్ని ఇవ్వాలన్నా, గణాంకాలను ప్రజలకు తెలియజేయాలన్నా, కేవలం సంబంధిత ప్రభుత్వ అధికారి నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే తెలియజేయాలన్నది మార్చి చివరి వారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం. అప్పటి నుంచి ప్రతి నిత్యమూ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను మీడియాకు తెలిపేందుకు సమావేశాలను ఏర్పాటు చేస్తూ వచ్చిన కేంద్రం, కేసుల సంఖ్య భారీగా పెరిగిన సమయానికి మీడియా సమావేశాలను నిలిపివేసింది.

మే 11న కేసులు 67,152కు చేరిన తరువాత మీడియా సమావేశాలు నిలిపివేసి, కేవలం పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ వచ్చిన కేంద్రం, కేసుల సంఖ్య లక్షను అధిగమించిన వేళ, ఆ మాత్రం సమాచారాన్ని కూడా అందించలేదు. కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య శాఖ అధికారులు మీడియాకు దూరమయ్యారు.

ఇదే విషయమై ఆరోగ్య శాఖను వివరణ కోరగా, మీడియా సమావేశాలకు బదులుగా ప్రకటనలు విడుదల చేయాలన్నది విధానపరమైన నిర్ణయమని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. నిత్యమూ ప్రభుత్వం తరఫున వివరాలను అందిస్తున్నామని తెలిపారు. కాగా, సుప్రీంకోర్టు సైతం కరోనాపై తన ఆదేశాల్లో మహమ్మారిపై స్వేచ్ఛగా చర్చలు జరిపి సమాచారాన్ని ప్రజలకు అందించవచ్చని, ఈ విషయంలో తాము కల్పించుకోలేమని స్పష్టం చేస్తూ, కేసుల విషయంలో మాత్రం అధికారిక సమాచారాన్నే తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం కూడా నిత్యమూ మీడియా బులెటిన్ లను విడుదల చేయాలని, ప్రజల్లోని అనుమానాలను నివృత్తి చేయాలని సూచించింది.

ఏప్రిల్ 25కు ముందు వరకూ ల్యాబ్ ల నుంచి కలెక్ట్ చేసిన కరోనా పరీక్షల గణాంకాలను విడుదల చేస్తూ వచ్చిన ఐసీఎంఆర్, ఆపై వివరాలను మీడియాకు అందించడాన్ని నిలిపివేసింది. మే 10 నుంచి రాష్ట్రాల వారీగా కరోనా గ్రాఫ్ లను హెల్త్ మినిస్ట్రీ వెబ్ సైట్ నుంచి తొలగించారు. దీంతో ప్రజలకు కరోనా వ్యాప్తిపై సమాచారం అందని పరిస్థితి నెలకొంది. తక్షణమే కేంద్రం స్పందించి, వాస్తవాలను తెలిపేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది.
Go Back to Shorts
India
Corona Virus
Helath Ministry
Media

More Telugu News