స్టైరీన్ విషవాయువుతో కూడా సహజీవనం చేయాలా..?: పవన్ కల్యాణ్

  • ఇటీవల వైజాగ్ లో ఘోర దుర్ఘటన
  • ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరీన్ గ్యాస్ లీక్
  • 15 వేల మంది ప్రజలకు ఏం భరోసా ఇస్తారని ప్రశ్నించిన పవన్
వైజాగ్ లో ఇటీవల జరిగిన విషవాయువు లీకైన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి, ప్రాణాపాయం నుంచి బయటపడిన వారికి పరిహారం ఇచ్చారు కానీ, ఆ పరిశ్రమ చుట్టుపక్కల నివసిస్తున్న 15,000 మంది ప్రజల జీవన్మరణ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పరిష్కారం చూపలేకపోయిందని విమర్శించారు. ఇప్పటికే కరోనాతో కలిసి జీవించాలని చెప్పిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఆర్ఆర్ వెంకటాపురం, పరిసర గ్రామాల ప్రజలను స్టైరీన్ విషవాయువుతో సహజీవనం చేయాలని తన చర్యలతో చెప్పకనే చెబుతోందని పవన్ పేర్కొన్నారు.

పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సకాలంలో స్పందించబట్టి ఎన్నో ప్రాణాలు నిలిచాయని, లేకపోతే పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాలైన వెంకటాపురం, పద్మాపురం, నందమూరి నగర్, వెంకటాద్రి గార్డెన్స్ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని తెలిపారు. 7 కిలోమీటర్ల పరిధిలోని 15 వేల మంది ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం గడుపుతున్నారని, వీరిలో భరోసా కలిగించే దిశగా రాష్ట్రం ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని విమర్శించారు.

Pawan Kalyan
Styrene Gas
LG Polymers
Andhra Pradesh
YSRCP

More Telugu News