ఏపీ ఎన్నికల కమిషనర్‌గా మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజు.. బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) వచ్చేశారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌పై వేటు వేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి  జస్టిస్ కనగరాజును నియమించింది. ఈ ఉదయమే విజయవాడలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదిస్తూ నిన్న ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తాజా ఆర్డినెన్స్‌తో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం ముగిసినట్టు అయింది. ఆయన గత నాలుగేళ్లుగా ఈ బాధ్యతల్లో ఉన్నారు. ఆర్డినెన్స్ అమల్లోకి రావడంతో రమేశ్ కుమార్ పదవీ కాలం అర్థాంతరంగా ముగిసిపోయింది.

కొత్త కమిషనర్‌గా జస్టిస్ కనగరాజు పేరును ప్రతిపాదిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్‌కు ప్రభుత్వం పంపిన పైల్‌ను గవర్నర్ ఆమోదించడంతో ఆయన నియామకం ఖరారైంది. ఫలితంగా ఈ ఉదయం ఆయన ఎస్‌ఈసీగా పదవీ బాధ్యతలు చేపట్టారు.


More Telugu News