ఘర్షణ, ఒకరి మృతి, ఉద్రిక్తతకు కారణమైన రూ.2వేల వ్యవహారం
- చిత్తూరు జిల్లాలో నెర్నిపల్లెలో ఘటన
- ఇనుప షీట్లు మార్చే విషయంలో వివాదం
- బలగాలను మోహరించిన పోలీసులు
చిన్న వ్యవహారం...అవగాహనతో మాట్లాడుకున్నా, పరస్పరం సర్దిచెప్పుకున్నా సరిపోయేది. కానీ ఇరువర్గాల పంతం ఒకరు చనిపోయేందుకు కారణం కావడమేకాక గ్రామంలో ఉద్రిక్తతలకు దారితీసి పోలీసులు మోహరించే వరకు వెళ్లింది. పోలీసుల కథనం మేరకు...చిత్తూరు జిల్లా వి.కోట మండలం నెర్నిపల్లె గ్రామంలో అమీర్ జాన్ దుకాణ సముదాయం నడుపుతున్నాడు. దుకాణాల ఇనుప షీట్లు మార్చే విషయంలో గ్రామానికే చెందిన ఎక్తియార్ కొడుకులు మోహిన్, ఆలీమ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పనిపూర్తయ్యాక రూ.2 వేలు అదనంగా తీసుకున్నారంటూ అమీర్ జాన్ కొడుకులు నదీమ్, అప్సర్లు ఎక్తియార్ కొడుకులను నిలదీశారు.
ఇది ఇరువర్గాల మధ్య వివాదం రగల్చగా నిన్నరాత్రి ఘర్షణకు దిగారు. ఈ గొడవలో ఎక్తియార్ తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేలోగానే చనిపోయాడు. దీంతో ఎక్తియార్ వర్గీయులు అమీర్ జాన్ ఇంటిపై దాడికి దిగారు. ఈ కారణంగా ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎక్తియార్ కుటుంబం, ఆయన వర్గీయులు మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఆందోళనకు దిగారు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో సమాచారం అందుకున్న పోలీసులు పెద్దమొత్తంలో బలగాలను గ్రామంలో మోహరించారు.