ఉగ్రవాద నిర్మూలనపై పాక్ చిత్తశుద్ధి చాటాలి: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్
- పాక్ మాటల్లో కాదు చేతల్లో చూపించాలి
- ఉగ్రవాదాన్ని పెంచే ఒక దేశంతో ఏ దేశమూ చర్చలకు రాదు
- జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి
‘పాకిస్థాన్ ఒక ఉగ్రవాద పరిశ్రమనే పెంచి పోషిస్తోంది. దీని ద్వారా భారత్ లోకి ఉగ్రవాదులను తరలిస్తూ దాడులకు పాల్పడుతోంది. దీన్ని పాక్ కూడా ఖండించదు. ఇప్పుడు నాకు చెప్పండి ? ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఇలాంటి ఒక దేశంతో ఏ దేశమైనా చర్చలు జరిపేందుకు ముందుకు వస్తుందా? ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు పాక్ సిద్ధంగా ఉందని మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చూపించాలి. అప్పుడే ప్రపంచం విశ్వసిస్తుంది’ అని జైశంకర్ అన్నారు.
అధికరణ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయని.. త్వరలోనే విదేశీ పాత్రికేయులను కూడా అక్కడికి వెళ్లేందుకు అనుమతిస్తామని మంత్రి చెప్పారు. అక్కడ విధించిన ఆంక్షల్లో కొన్నింటిని ఎత్తివేశామన్నారు. త్వరలో పరిస్థితులను సమీక్షించి పూర్తి ఆంక్షలను ఎత్తివేస్తామని తెలిపారు.