ఏపీకి పాకిన ఈఎస్ఐ మందుల కుంభకోణం

  • సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మందుల స్కామ్
  • ఇప్పటికే పలువురి అరెస్టు
  • ఏపీలోనూ సోదాలు
హైదరాబాద్ ఈఎస్ఐలో కోట్ల రూపాయల మేర కుంభకోణం జరగడం సంచలనం సృష్టించింది. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి సహా అనేకమంది ఉన్నతస్థాయి వ్యక్తులు ఈ స్కామ్ లో సూత్రధారులని ఏసీబీ ప్రాథమిక విచారణలోనే తేల్చింది. నకిలీ బిల్లులతో మందులు కొనుగోలు చేసి కోట్ల రూపాయలు స్వాహా చేసినట్టు తెలిసింది. అయితే ఈ కుంభకోణం ఇప్పుడు ఏపీకి కూడా పాకింది. ఈ స్కామ్ కు సంబంధించి ఈఎస్ఐ విజయవాడ డైరెక్టరేట్, తిరుపతి కార్యాలయాల్లోనూ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పలు కీలక పత్రాలు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ఈఎస్ఐ స్కాంలో అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా, మరో కీలక అధికారి సురేంద్రనాథ్ బాబును కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈఎస్ఐ డైరెక్టరేట్ లో సురేంద్రనాథ్ బాబు సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.

తప్పుడు బిల్లులతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టడంలో సురేంద్రనాథ్ ది కీలక పాత్ర అని భావిస్తున్నారు. ఫార్మసిస్టులను బెదిరించి తప్పుడు బిల్లులు తయారుచేయించినట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి, అసిస్టెంట్ డైరెక్టర్ పద్మల తరఫున సురేంద్రనాథ్ దందా నడిపించినట్టు అధికారులు గుర్తించారు.
Go Back to Shorts
ESI
Telangana
Andhra Pradesh
Hyderabad

More Telugu News