సుజనా చౌదరి భూములపై ఏపీ ప్రభుత్వ రహస్య విచారణ

  • గత వారం రోజులుగా కంచికచర్ల మండలంలో పర్యటిస్తున్న అధికారులు
  • అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత భూక్రయవిక్రయాలపై ఆరా
  • ఆరా నిజమేనన్న కంచికచర్ల తహసీల్దార్
ఏపీ రాజధాని అమరావతిలో బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి కానీ, ఆయన బంధువులకు కానీ బినామీ పేర్లతో ఏవైనా భూములు ఉన్నాయా? అన్న కోణంలో ఏపీ ప్రభుత్వం రహస్య విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. రెవెన్యూ, సీఐడీ, ఏసీబీ, విజెలెన్స్ అధికారులు గత వారం రోజులుగా మోగలూరు, మున్నలూరు, బత్తినపాడు, చెవిటికల్లు గ్రామాల్లో పర్యటిస్తూ ఆరా తీస్తున్నారు. ఆయా గ్రామాల్లోని రైతులను కలిసి భూముల విషయమై ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన భూక్రయ విక్రయాల గురించి కూడా వివరాలు సేకరిస్తున్నారు.

కృష్ణా జిల్లా కంచికచర్ల మండల పరిధిలో సుజనాకు భూములు ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించిన నేపథ్యంలో ఈ వివరాలు సేకరిస్తున్నారు. కాగా, రాజధాని ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్న అధికారులు రాజధాని ప్రకటన తర్వాత ఆయా ప్రాంతాల్లో ఎవరి నుంచి ఎవరు ఎంతెంత విస్తీర్ణంలో భూములు కొన్నారు? అన్న వివరాలను కూపీ లాగుతున్నారు. అధికారులు వివరాలు సేకరించడం నిజమేనని కంచికచర్ల తహసీల్దార్ రాజకుమారి తెలిపారు.
Go Back to Shorts
Andhra Pradesh
amaravathi
Sujana Chowdary
lands

More Telugu News