odisa: అడవిలో చిక్కుకున్న 70 ఏళ్ల బామ్మ.. కాపాడి 5 కి.మీ భుజాలపై మోసుకొచ్చిన సీఆర్పీఎఫ్ బలగాలు!

  • ఒడిశాలోని న్యుపారాలో ఘటన
  • ఇంట్లో గొడవ జరగడంతో అలిగిన వృద్ధురాలు
  • అడవిలోకి వెళ్లాక దారితెలియకపోవడంతో ఇబ్బంది
 ఒడిశాలోని న్యుపారాలో 70 ఏళ్ల బామ్మకు, ఇంట్లో వాళ్లకు వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపంతో 2-3 రోజుల క్రితం ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. బాధతో నడుస్తూ అటవీప్రాంతంలోకి వెళ్లిపోయింది. అయితే కొన్నిగంటల తర్వాత ఇంటికి తిరిగి వచ్చేందుకు ప్రయత్నించగా, ఆమెకు దారి తెలియలేదు. దట్టమైన అడవిలో తాగేందుకు మంచినీరు, తినేందుకు ఎలాంటి ఆహారం ఆ పెద్దావిడకు దొరకలేదు. దీంతో 70 ఏళ్ల వృద్ధురాలు నిస్సత్తువతో ఓ చోట పడిపోయింది.

అయితే కూంబింగ్ కోసం అటుగా వెళుతుగా సీఆర్పీఎఫ్ 216వ బెటాలియన్ సదరు వృద్ధురాలిని గుర్తించింది. దట్టమైన అడవిలో వాహనాలు వచ్చే అవకాశం లేకపోవడంతో సీఆర్పీఎఫ్ జవాన్లు తొలుత ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. మంచినీరు అందించాక వృద్ధురాలు స్థిమితపడటంతో డోలీని సిద్ధం చేశారు. అనంతరం దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఆ పెద్దావిడను మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కాగా, సీఆర్పీఎఫ్ జవాన్లు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
odisa
70 year old lady
Odisha
moribund in jungle
Altercation with family
5Km
Carried the lady

More Telugu News