బుచ్చయ్య చౌదరి ఆవేదన... తనకేమీ తెలియదన్న అంబటి!
- అసెంబ్లీ లాబీలో తారసపడ్డ బుచ్చయ్య, అంబటి
- సస్పెండ్ అయ్యేంతగా గొడవ చేయడం ఎందుకు?
- బుచ్చయ్యను ప్రశ్నించిన అంబటి రాంబాబు
ఏపీ అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండైన తరువాత, వారంతా బయటకు వచ్చిన వేళ ఓ ఆసక్తికర ఘటన జరిగింది. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయుడు బయటకు వచ్చిన సమయంలో అప్పటివరకూ సభలో లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎదురుపడ్డారు. ఆ సమయంలో బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, గడచిన ఐదు సంవత్సరాల సమయంలో మార్షల్స్ ఎన్నడూ అసెంబ్లీ లోపలికి రాలేదని గుర్తు చేశారు. ఈ విషయం తనకు తెలియదని, తాను ఇప్పుడే వస్తున్నానని అంబటి వ్యాఖ్యానించారు. తమను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేశారని బుచ్చయ్య ఆవేదన వ్యక్తం చేయగా, సస్పెండయ్యేంతగా గొడవ చేయడం దేనికంటూ కౌంటర్ వేసిన అంబటి రాంబాబు, 'వచ్చే సెషన్లో కలుద్దాం' అంటూ అసెంబ్లీలోకి వెళ్లిపోయారు.