బీజేపీలో చేరిన ముస్లిం మహిళ.. ఇల్లు ఖాళీ చేయమన్న యజమాని
- కరెంటు బిల్లు నాలుగువేలు ఇవ్వాలన్న యజమాని తల్లి
- వాగ్వివాదం అనంతరం బీజేపీలో చేరిన మహిళ
- కేసు దర్యాప్తులో ఉందన్న ఎఎస్పీ
బీజేపీలో చేరిన మహిళను ఇల్లు ఖాళీ చేయాలంటూ ఆదేశించడమే కాకుండా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు ఆమె యజమాని. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో జరిగిందీ ఘటన. తాను నిన్ననే బీజేపీలో చేరానని, విషయం తెలిసిన యజమాని అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేయమని చెప్పడమే కాకుండా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు గులిస్తానా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అలీగఢ్ సీనియర్ ఎస్పీ అకాశ్ కుల్హరీ తెలిపారు. విద్యుత్ బిల్లు కోసం యజమాని తల్లి బాధితురాలిని రూ.4 వేలు అడిగిందని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగినట్టు తెలుస్తోందని ఎస్పీ పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరిందని ఆయన వివరించారు. కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు.