స్పీకర్ ను అవమానించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య: ఏపీ అసెంబ్లీ లో రోజా

  • తమ్మినేని స్పీకర్ అయినందుకు అందరూ సంతోషపడాలి
  •  గతంలో కిరణ్ కుమార్ రెడ్డిని కూడా బాబు అవమానించారు 
  • అచ్చెన్నాయుడికి కడుపు మంటగా ఉన్నట్టుంది  
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారాంకు ఎమ్మెల్యే రోజా అభినందనలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ, ఒక అత్యున్నత స్థానంలో వెనుకబడిన వర్గానికి చెందిన తమ్మినేనికి అవకాశం కల్పించిన తమ అధినేత జగన్ కు కూడా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఎప్పుడూ ఒక మంచి గురించి లేదా చెడు గురించి మాట్లాడేటప్పుడు ఉదాహరణగా గతాన్ని మనం తీసుకుంటామని అన్నారు.

స్పీకర్ ను అవమానించడంలో గానీ, ఆ చైర్ ను దుర్వినియోగం చేయడం గానీ చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, గతాన్ని చూసినా ఇప్పుడు చూసినా అర్థమవుతుందని అన్నారు. ఎందుకంటే, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ అయినప్పుడు ఆయన్ని గౌరవించకుండా అవమానించడం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారని అన్నారు. మళ్లీ ఈ రోజున తమ్మినేని స్పీకర్ అయినప్పుడు అలాంటి పరిస్థితినే చూస్తున్నామని, తమకు చాలా బాధాకరంగా ఉందని అన్నారు.

ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న తమ్మినేని ఈ పదవిని దక్కించుకున్నందుకు అందరూ సంతోషపడాలని అన్నారు. ముఖ్యంగా, తమ్మినేని సొంత జిల్లాకు చెందిన వాసులు మరింత సంతోషపడాలి కానీ, అచ్చెన్నాయుడిని చూస్తుంటే అలా అనిపించడం లేదని, ఆయన మాటలు చూస్తుంటే సంతోషం కంటే కడుపుమంటే ఎక్కువగా ఉన్నట్టు కనపడుతోందని అన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
assembly
mla
roja

More Telugu News