Yellow Travels: కాలి బూడిదైన ఎల్లో ట్రావెల్స్ బస్సు... కట్టుబట్టలతో మిగిలిన ప్రయాణికులు!

20 మందికిపైగా ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఎల్లో ట్రావెల్స్ కు చెందిన బస్సు అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. కర్నూలు జిల్లా ప్యాపిలి సమీపంలో జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున ఘటన జరుగగా, ప్రయాణికులు కట్టుబట్టలతో మిగిలారు. బస్సు వెనుకవైపు నుంచి మంటలు వ్యాపించడంతో ఎవరూ తమ సామాన్లు తీసుకోలేకపోయారు.

బస్సు వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులకు, ప్లాస్టిక్ కాలుతున్న వాసన రావడంతో డ్రైవర్ కు సమాచారం ఇచ్చారు. డ్రైవర్ అప్రమత్తమై, బస్సును రోడ్డు పక్కన ఆపగానే మంటలు పెరిగిపోయాయని బాధితులు వెల్లడించారు. ప్రయాణికులు కిందకు దిగగానే బస్సంతా మంటలు వ్యాపించాయని, క్షణాల్లోనే సామానంతా కాలిపోయిందని అన్నారు. కాగా, విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి వచ్చేసరికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో కర్నూలు - బెంగళూరు రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది.
Yellow Travels
Bus
Passengers
Kurnool District

More Telugu News