ఫలించిన నీతా అంబానీ పూజలు... మ్యాచ్ ముగిసేవరకూ అమ్మవారి అక్షింతలు తలపైనే!

హైదరాబాద్ లోని బల్కంపేటలో ఉన్న అమ్మవారిపై అత్యంత భక్తి శ్రద్ధలు చూపించే ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ, నిన్న మ్యాచ్ కి ముందు వెళ్లి, తమ ముంబై జట్టు విజయం కోసం ప్రత్యేక పూజలు చేయించారు. పూజల తరువాత వేయించుకున్న అక్షింతలు నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ ముగిసేంత వరకూ ఆమె తలపైనే కనిపించడం గమనార్హం. ముంబై ఇండియన్స్‌ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తున్న నీతా అంబానీ, ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ ని ప్రత్యక్షంగా తిలకించేందుకు నగరానికి వచ్చారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నీతా అంబానీ రాగా, అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించారు.

ఇక నిన్న మ్యాచ్ తుది క్షణం వరకూ ఉత్కంఠగా సాగగా, ముంబై ఇండియన్స్ జట్టు ఒక పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించి, నాలుగోసారి కప్పును ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం స్పందించిన నీతా అంబానీ, తాను చివరి ఓవర్ ను చూడలేకపోయానని, కళ్లు మూసుకునే కూర్చున్నానని, చివరి బాల్ కు మలింగ వికెట్ తీయడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పారు. మ్యాచ్ ఆసాంతం ఇరు జట్లూ బాగా ఆడాయని కితాబిచ్చారు.
Go Back to Shorts
Neeta Ambani
Balkampet
Chennai Superkings
Mumbai Indians

More Telugu News