ఎవరో వచ్చి ఫిర్యాదు చేస్తే సినిమా ఆపేస్తారా?: సెన్సార్ బోర్డుపై నిప్పులు చెరిగిన ఆర్.నారాయణమూర్తి

  • శ్రీదేవి బతికుంటే కన్నీళ్లు పెట్టుకునేది!
  • అమరావతి వెళ్లి వివరణ ఇవ్వాలా?
  • సెన్సార్ బోర్డు వైఖరిని ప్రశ్నించిన సీనియర్ నటుడు
టాలీవుడ్ లో విప్లవ కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఒరవడి సృష్టించుకున్న నటుడు ఆర్. నారాయణమూర్తి. తాజాగా, ఆయన అందాలతార శ్రీదేవిపై ప్రముఖ పాత్రికేయుడు పసుపులేటి రామారావు రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెన్సార్ బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో వచ్చి ఫిర్యాదు చేస్తే సినిమా ఆపేస్తా‌రా? అంటూ మండిపడ్డారు.

రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తే ఎవరో, ఏదో ఫిర్యాదు చేశారని చెప్పి సినిమాను నిలిపివేయడం దారుణమని అన్నారు. ప్రతిదానికీ అమరావతి వెళ్లి వివరణ ఇవ్వాలా? అని ప్రశ్నించారు. నేడు శ్రీదేవి బతికుంటే సెన్సార్ బోర్డు తీరును చూసి కంటతడి పెట్టుకుని ఉండేదని నారాయణమూర్తి అన్నారు. గతంలో తన సినిమాకు సెన్సార్ బోర్డుతో ఇబ్బందులు ఎదురైనప్పుడు శ్రీదేవి సహాయం చేసిందని గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లో తాను విప్లవ సినిమాలు తీస్తుంటే శ్రీదేవి ఎంతో ఆశ్చర్యపోయారని, తనకు కూడా విప్లవ పంథా సినిమాలు తీయాలనుందని చెప్పారని నారాయణమూర్తి వెల్లడించారు.
Go Back to Shorts
Tollywood

More Telugu News