Andhra Pradesh: ఐటీ గ్రిడ్ వివాదం: కూకట్ పల్లిలో లోకేశ్వర్ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు.. అడ్డుకున్న తెలంగాణ పోలీసులు!

  • కూకట్ పల్లి ఫార్చ్యూన్ ఫీల్డ్స్ వద్ద హైడ్రామా
  • ఫిర్యాదుదారు లోకేశ్వర్ రెడ్డి ఇంటికెళ్లిన ఏపీ పోలీసులు
  • అడ్డుకున్న తెలంగాణ పోలీసులు, వాగ్వాదం
హైదరాబాద్ లోని మాదాపూర్ లో ‘ఐటీ గ్రిడ్’ కంపెనీ వ్యవహారం ఏపీ-తెలంగాణ పోలీసుల మధ్య వివాదం చిలికిచిలికి గాలివానగా మారుతోంది. ఇప్పటికే తన సహోద్యోగులు నలుగురు కనిపించడం లేదని కంపెనీకి చెందిన అశోక్ అనే ఉద్యోగి తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

తాజాగా ఐటీ గ్రిడ్ వ్యవహారంలో తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డి ఇంటికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు బయలుదేరారు. ఈ ఫిర్యాదు వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకునేందుకు ఏపీ పోలీసులు కూకట్ పల్లిలోని ఫార్చ్యూన్ ఫీల్డ్స్ లో ఉన్న లోకేశ్వర్ రెడ్డి ఇంటికి వచ్చారు.

ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. లోకేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో ఏపీ పోలీసులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Andhra Pradesh
Telangana
Telugudesam
YSRCP
ap police
Police
it grid

More Telugu News