‘విజయవాడ పశ్చిమ’ సీటు పంచాయతీ.. జలీల్ ఖాన్ కుమార్తెకు మద్దతు పలికిన మంత్రి దేవినేని ఉమ!

  • పశ్చిమ నుంచి ఆమె గెలుస్తారని ధీమా
  • గోద్రాను ప్రశ్నించినందుకే మోదీ కక్ష కట్టారని మండిపాటు
  • అవినీతిపరుడైన జగన్ తో కలిసి చీకటి రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జిల్లాలోని విజయవాడ పశ్చిమ సీటుపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూర్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగూర్ మీరాలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఇటీవల వీరిద్దరూ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి పశ్చిమ టికెట్ తమకే ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూర్ కు ఏపీ మంత్రి దేవినేని ఉమ నుంచి అనూహ్య మద్దతు లభించింది.

ఈరోజు షబానా, ఇతర టీడీపీ నేతలతో కలిసి మంత్రి ఉమామహేశ్వరరావు టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి షబానా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మహిళలకు దివంగత ఎన్టీఆర్‌, ఏపీ సీఎం చంద్రబాబు గణనీయమైన ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గోద్రా అల్లర్లపై ప్రశ్నించినందుకే చంద్రబాబుపై మోదీ పగపెంచుకున్నారని ఆరోపించారు. అందుకే అవినీతిపరుడైన జగన్ తో కలిసి చీకటి రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్ మోదీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని విమర్శించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Vijayawada
west
Telugudesam
shabana
devineni uma
support

More Telugu News