మహిళల పొలిటికల్ కెరీర్ పై ఎంపీ పప్పు యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
- పురుష నేతల గదుల్లో గడపకుండా మహిళలు రాజకీయాల్లో ముందుకు సాగలేరన్న పప్పు యాదవ్
- మహిళలను దోపిడీ చేయడం రాజకీయ సంస్కృతిగా మారిపోయిందని వ్యాఖ్య
- పప్పు యాదవ్కు నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్
జాతీయ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు చుట్టూ చర్చ జరుగుతున్న తరుణంలో, బీహార్ ఎంపీ పప్పు యాదవ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి. రాజకీయాల్లోకి వచ్చే మహిళల పట్ల బీహార్ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. 90 శాతం మంది మహిళలు పురుష నాయకుల గదుల్లో గడపకుండా తమ పొలిటికల్ కెరీర్లో ముందుకు సాగలేరని ఆయన వ్యాఖ్యానించారు.
దేశంలో మహిళలను దేవతలుగా కొలుస్తామని చెబుతూనే, వ్యవస్థలో వారికి కనీస గౌరవం దక్కడం లేదని ఆయన విమర్శించారు. మెజారిటీ పురుష నాయకులను 'రాబందులు'గా అభివర్ణిస్తూ, మహిళలను దోపిడీ చేయడం ఇప్పుడు ఒక రాజకీయ సంస్కృతిగా మారిపోయిందని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు షెహజాద్ పూనావాలా తీవ్రంగా మండిపడ్డారు. పప్పు యాదవ్ వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మద్దతు ఉన్న నాయకుడు ఇలా మాట్లాడటం మహిళల పట్ల ప్రతిపక్షాల నీచమైన మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు.
ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన బీహార్ మహిళా కమిషన్, పప్పు యాదవ్కు నోటీసులు జారీ చేసింది. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు వివరణ కోరుతూ, మీ సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.