Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించిన తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న చెన్నైలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దక్షిణ భారతదేశం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... దక్షిణాదిపై కేంద్ర వివక్ష గురించి పవన్ మాట్లాడటం బాగానే ఉందని... తమిళనాడులో తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయంపై ఆయన ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలుగువారిపై తమిళనాడు ప్రభుత్వాలు చూపుతున్న వివక్ష గురించి పవన్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమని... తమిళనాడులో ఉన్న తెలుగువారందరికీ ఇది బాధ కలిగించిందని చెప్పారు.