సీబీఐకి ‘సమ్మతి’ ఉత్తర్వుల రద్దు.. స్పందించిన హోంమంత్రి చినరాజప్ప!

  • సీబీఐలో కుమ్ములాటలు ముదిరాయి
  • మేధావుల సలహా మేరకే రద్దు నిర్ణయం
  • విచారణకు ముందస్తు అనుమతి తప్పనిసరి
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)పై ఇటీవల వచ్చిన అభియోగాలు, అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలోనే ఆ సంస్థకు ఇచ్చిన ‘సమ్మతి’ ఉత్తర్వులను రద్దు చేశామని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఈ విషయంలో పలువురు మేధావుల సలహాలు, సూచనలు కూడా తీసుకున్నామని చెప్పారు.

ఇకపై ఆంధ్రప్రదేశ్ లో ఏ కేసు విచారణలో అయినా సీబీఐ ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక సహా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే సీబీఐకి సమ్మతి ఉత్తర్వులు రద్దు చేశాయని చినరాజప్ప తెలిపారు. సీబీఐపై తమకు ఇప్పటికీ విశ్వాసం ఉందని హోంమంత్రి స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఈ నిర్ణయం తీసుకున్నామన్న వాదనలను ఆయన ఖండించారు. సీబీఐ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఓ ఆయుధంగా మారిపోయిందని హోంమంత్రి దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వం సమ్మతి ఉత్తర్వులను రద్దు చేసిన నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో లేదా రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే సంబంధిత కేసుల్లో సీబీఐ విచారణ చేపట్టాల్సి ఉంటుంది.
Go Back to Shorts
Andhra Pradesh
home minister
Nimmakayala Chinarajappa
CBI
orders
cancel

More Telugu News