Vizag: జగన్ పై హత్యాయత్నం కేసు... బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన శ్రీనివాసరావు!

  • కోర్టులో శ్రీనివాస్ న్యాయవాది పిటిషన్
  • వారం రోజులు విచారించారంటున్న న్యాయవాది
  • మళ్లీ కస్టడీ కోరనున్న సిట్ అధికారులు
గత నెలలో విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావు, బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. అతని తరఫు న్యాయవాది, ఈ పిటిషన్ ను కోర్టుకు అందించగా, నేడు దానిపై విచారణ జరగనుంది. మరోవైపు శ్రీనివాసరావు విచారణ ఇంకా పూర్తి కాలేదని, ఈ కేసులో మరిన్ని విషయాలను తెలుసుకోవాల్సి వున్నందున అతన్ని కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు నేడు మరో పిటిషన్ ను దాఖలు చేయనున్నారు.

ఇదే సమయంలో అతనికి పాలీగ్రాఫ్ టెస్టులను చేయించి, చెబుతున్నది నిజమో, అబద్ధమో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు అనుమతించాలని కోరుతూ, కూడా మరో పిటిషన్ దాఖలు చేయనున్నారు. తన క్లయింట్ ను ఇప్పటికే వారం రోజుల పాటు విచారించి, అన్ని విషయాలూ తెలుసుకున్నారు కాబట్టి, బెయిల్ మంజూరు చేయాలని శ్రీనివాస్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించనున్నారు.
Vizag
Jagan
Srinivasa Rao
Murder Attempt

More Telugu News