జీవీఎల్ ఎవరు? అతనికేమీ పనీపాటా లేదు: హీరో శివాజీ

‘ఆపరేషన్ గరుడ’లో భాగంగానే వైసీపీ అధినేత జగన్ పై దాడి జరిగిందంటూ వస్తున్న వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఖండించడంపై ప్రత్యేక హోదా సాధన సమితి నేత, హీరో శివాజీ స్పందించారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘నాకు అర్థం కాని విషయం ఏంటంటే.. జీవీఎల్ ఎవరు? అతనికేమీ పనీపాటా లేకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడి పదవి అతనికి ఇచ్చారు. అతను ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మాట్లాడాలి.

 లేదంటే, ఆంధ్రప్రదేశ్ మీద గౌరవం ఉంటే ప్రత్యేకహోదా, లోటు బడ్జెట్, హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు, అమరావతి నిధులు, ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ గురించి ఆయన మాట్లాడాలి. ‘చంద్రబాబునాయుడు దొంగ, దోపిడీదారుడు, అవినీతి పరుడు, దుర్మార్గుడు..’ అనేగా ఇతను మాట్లాడేది! అంతకు మించి ఏమన్నా మాట్లాడతాడా? చంద్రబాబునాయుడు అవినీతి పరుడైతే సీబీఐ కేసుల్లో ఇరికించడం పెద్ద కష్టమేమీ కాదు. హత్యలు చేయించేవాడైతే ఈ స్థాయికి రాడు.. ఇంత దూరం ప్రజలు రానివ్వరు. అంటే, ప్రజల మీద, వ్యవస్థల మీద ఇతనికి నమ్మకం లేదు. కేవలం మోదీ ఏది చెబితే దాని గురించి మాట్లాడతాడు’ అని మండిపడ్డారు.


More Telugu News