Roja: రోజాకు ఇంకా మదం తగ్గలేదు... మాట జారితే తాట తీస్తాం: మంత్రి సవిత ఫైర్

Minister Savitha Fires at Roja Over Comments on Bhuvaneswari
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజాపై బీసీ సంక్షేమం, జౌళి, వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం కోల్పోయి, 2024 ఎన్నికల్లో నగరి ప్రజలు చెప్పుతో కొట్టినట్టు తీర్పు ఇచ్చినా రోజా తన తీరు మార్చుకోలేదని, ఇంకా అదే మదంతో మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇంట్లో ఖాళీగా కూర్చోలేక గాలి మాటలు మాట్లాడుతూ, అనవసర విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా నారా భువనేశ్వరి గారిపై నోరు జారితే తాట తీస్తామని తీవ్రంగా హెచ్చరించారు. వైఎస్ విజయమ్మ తన కుమారుడు జగన్‌కు రాసిన లేఖ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ అధిష్ఠానం రోజాను రంగంలోకి దింపిందని, ఆమె ఆ స్క్రిప్ట్ చదువుతున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. "ఓడిపోయాక రోజాకు బుద్ధి వచ్చిందనుకున్నాం. కానీ ఆమె ఇంకా నీచంగా మాట్లాడటమే తన అజెండాగా పెట్టుకున్నారు. అసలు నారా వారి కుటుంబం గురించి, భువనమ్మ గారి గురించి మాట్లాడే అర్హత రోజాకు ఉందా? మేం హిందువులమని నిరూపించుకోవడానికి మీలాగా ఇంట్లో సినిమా సెట్టింగులు వేసుకోవాల్సిన అవసరం లేదు. సీఎం చంద్రబాబు గారు తన జీవితకాలంలో కుటుంబ సమేతంగా ఎన్నోసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ విషయాలు రోజాకు కనిపించవా?" అని ప్రశ్నించారు.

ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి ఏనాడైనా తన భార్య భారతితో కలిసి దేవాలయానికి వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించారా అని, అందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే చూపించాలని రోజాకు సవాల్ విసిరారు. "వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలను, విగ్రహాలను ధ్వంసం చేశారు, రథాలను తగలబెట్టారు. ఇప్పుడు హిందూ సంప్రదాయాల గురించి నీతులు చెబుతుంటే నవ్వొస్తోంది. 

రేపు (మార్చి 21) ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. నిజంగా వెంకటేశ్వర స్వామిపై నమ్మకం, హిందూ ఆచారాలపై విశ్వాసం ఉంటే.. జగన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చి, తన భార్యతో కలిసి స్వామివారిని దర్శించుకోవాలి. ఆ పని మీ జగన్ రెడ్డి చేయగలరా?" అని రోజాను నిలదీశారు.

రాజకీయాలకు దూరంగా ఉంటూ, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న భువనమ్మ గారిని తమ నీచ రాజకీయాల్లోకి లాగడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని సవిత అన్నారు. జగన్ రెడ్డి ముందు తన తల్లి విజయమ్మకు, చెల్లెళ్లు షర్మిల, సునీతలకు న్యాయం చేయాలని, లేదంటే సొంత కుటుంబానికే న్యాయం చేయలేని అసమర్థుడిగా చరిత్రలో మిగిలిపోతారని హితవు పలికారు. రోజా తన నోరు అదుపులో పెట్టుకుని, హుందాగా రాజకీయాలు చేయాలని మంత్రి సవిత హెచ్చరించారు.
Go Back to Shorts
Roja
YS Jagan Mohan Reddy
Nara Bhuvaneswari
Savitha
Telugu Desam Party
YSR Congress Party
Andhra Pradesh Politics
Chandrababu Naidu
TDP
YS Vijayamma

More Telugu News