తిరుమల చేరుకున్న మంత్రి నారా లోకేశ్... ఘనస్వాగతం పలికిన టీటీడీ అధికారులు
- కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు కోసం తిరుమలకు నారా లోకేశ్
- రేపు ఉదయం కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్న నారా కుటుంబం
- అన్నప్రసాదం ట్రస్టుకు రూ.44 లక్షల భారీ విరాళం ప్రకటన
- మంత్రి లోకేశ్ కు ఘనస్వాగతం పలికిన మంత్రి అనగాని, టీటీడీ ఛైర్మన్
- రాత్రికి గాయత్రీ అతిథి గృహంలో బస చేయనున్న నారా కుటుంబం
అంతకుముందు, తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి లోకేశ్ కు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు. అక్కడ ఆయనకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, ఎమ్మెల్యే పులివర్తి నాని, ఇతర అధికారులు, నేతలు స్వాగతం పలికారు.
ఈ రోజు రాత్రి నారా కుటుంబం తిరుమలలోని గాయత్రీ అతిథి గృహంలో బస చేస్తుంది. శనివారం ఉదయం దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనదని, దేవాన్ష్ పుట్టినరోజును ఏటా తిరుమలలో జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు.




