Chandrababu Naidu: గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు... సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Godavari River Tragedy Five Engineering Students Drowned in Polavaram
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లాలో శుక్రవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీయగా, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

పోలీసుల వివరాల ప్రకారం, అమరావతిలోని ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు ఉగాది సెలవుల సందర్భంగా విహారయాత్రకు వెళ్లారు. భద్రాచలం సందర్శన అనంతరం ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరి నదిలో స్నానం చేసేందుకు దిగారు. నది లోతుపై అవగాహన లేకపోవడంతో నీటి ప్రవాహానికి ఐదుగురు కొట్టుకుపోయారు. మరో ఇద్దరు విద్యార్థులు చాకచక్యంగా ఒడ్డుకు చేరుకున్నారు.

సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు పడవల సాయంతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సి. శ్రీకర్ (భద్రాచలం), పి. అభిరామ్ (విజయనగరం), నవదీప్ (ఉయ్యూరు) మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన గోక తేజ (ఉయ్యూరు), పాశం సతీష్ కుమార్ (మదనపల్లె) కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రమాదం నుంచి బయటపడిన వారిని చందూరి దీపక్, గడ్డం హర్షవర్ధన్‌గా గుర్తించారు.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Godavari River
Andhra Pradesh
Polavaram
Engineering Students Drowned
SRM Engineering College
River Tragedy
Student Death
Etapaka Mandal
Purushottapatnam

More Telugu News