గెలుపు గుర్రాలకే టికెట్లు: టీటీడీపీ
తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ లు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీపీ నేత పెద్దిరెడ్డి మాట్లాడుతూ, గెలుపు గుర్రాలకే టీడీపీ టికెట్లు దక్కుతాయని స్పష్టం చేశారు. మహా కూటమి గెలుపుకు కృషి చేసే నేతలకు భవిష్యత్తులో పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పారు. మహా కూటమిని అధికారంలోకి తీసుకురావడమే టీటీడీపీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.