ముంబైలో హృదయవిదారకం... బైక్ పై వెళుతూ గుంతలో పడి, బస్సుకింద నలిగిన యువతి... సీసీటీవీలో దృశ్యాలు!
- ముంబైలో భారీ వర్షాలు
- కల్యాణ్ నగర్ సమీపంలో దారుణం
- బైక్ స్కిడ్ అయి కిందపడిన ఉపాధ్యాయురాలు
- పక్కనే వస్తున్న బస్సు వెనకచక్రాల కింద పడి మృతి
మరణించిన యువతి థానే ప్రాంతంలోని ఓ స్కూల్ లో పనిచేస్తున్న మనీషా బోయిర్ గా గుర్తించారు. తన బంధువు బైక్ నడుపుతూ ఉంటే, ఆమె వెనుక కూర్చుని గొడుగు పట్టుకుని ఉంది. వారి వాహనం శివాజీ చౌక్ వద్దకు రాగానే, గుంతలో పడింది. ఆపై వీరిద్దరూ కుడివైపునకు పడిపోయారు. అదే సమయంలో అటుగా వస్తున్న బస్సు వెనుక చక్రాల కింద మనీషా చిక్కుకుపోయింది. ఘటనా స్థలిలోనే ఆమె మరణించింది.
ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండగా, రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు చోట్ల లోకల్ రైళ్లు ఆగిపోయాయి. శనివారం నుంచి రికార్డు స్థాయిలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.