జనాలను చూస్తే చాలు.. రెచ్చిపోతారు: బాలయ్యపై విష్ణుకుమార్ రాజు ఫైర్

ప్రధాని మోదీపై నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. జనాలను చూస్తే రెచ్చిపోయే బాలయ్య బాబు నోటికొచ్చినట్టు మాట్లాడారని... సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఇలా మాట్లాడటం దారుణమని చెప్పారు. బాలయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు.

చంద్రబాబు చేపట్టిన దీక్షతో రూ. 20 నుంచి 30 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమయిందని అన్నారు. స్వార్థపూరితమైన రాజకీయాలను చేస్తున్న చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ ను తీసుకొచ్చే బాధ్యతను భుజస్కందాలపై వేసుకున్నానని మంత్రి గంటా శ్రీనివాసరావు చెబుతున్నారని... ఆయన అంత బరువు మోయాల్సిన అవసరం లేదని... జోన్ ను బీజేపీ ఇస్తుందని అన్నారు.

30వ తేదీన చంద్రబాబు చేపట్టనున్న దీక్ష కూడా స్వార్థపూరితమైనదే అని అన్నారు. చెప్పిందే చెబుతూ ముఖ్యమంత్రి అందరికీ బోర్ కొట్టిస్తున్నారని... ఈసారి మాట్లాడేటప్పుడు ఒక ఆర్కెస్ట్రా కూడా పెట్టించాలని... అప్పుడు వినేందుకు వినసొంపుగా ఉంటుందని దెప్పి పొడిచారు. 
Go Back to Shorts
Chandrababu
Balakrishna
vishnu kumar raju
Ganta Srinivasa Rao
Narendra Modi

More Telugu News