Hyderabad: కేసీఆర్ సర్కారు సంచలన నిర్ణయం... జంటనగరాల్లోకి ప్రైవేటు బస్సులకు నో ఎంట్రీ!

హైదరాబాద్ లో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరం లోపలికి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు ఎంట్రీని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆర్టీయే అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవాలని సూచించాయి. నిబంధనలను అతిక్రమించి, నగరంలోకి ప్రవేశిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని, బస్సులను సీజ్ చేసి, గుర్తింపును రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

 కాగా, ప్రస్తుతం ఉదయం 8 గంటలలోపు, రాత్రి 9 గంటల తరువాత నగరంలోకి ప్రైవేటు బస్సులను అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు ఉదయం 8 గంటలలోపు గమ్యస్థానాలకు చేరిపోతుండగా, రాత్రి 9 గంటల తరువాత శివార్లలోని బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి బయలుదేరుతున్నాయి. సర్కారు తాజా నిర్ణయంతో విజయవాడ వైపు నుంచి వచ్చే బస్సులు ఎల్బీ నగర్, కర్నూలు వైపు నుంచి వచ్చే బస్సులు అత్తాపూర్ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావాల్సి వుంటుంది. ఈ నిర్ణయంపై ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల స్పందన వెలువడాల్సివుంది.
Hyderabad
Traphic
Private Travels
Buses

More Telugu News