రాయపాటితో పాటు కారులో వెళ్లి చంద్రబాబును కలిసిన వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా!

  • గుంటూరులో ఒమెగా ఆసుపత్రిని ప్రారంభించిన చంద్రబాబు
  • టీడీపీ ఎంపీ రాయపాటితో కలిసి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా
  • హెలిప్యాడ్ వద్ద చంద్రబాబును కలిసిన ముస్తఫా
సీఎం చంద్రబాబును గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కలవడం చర్చనీయాంశమైంది. గుంటూరులో ఒమెగా ఆసుపత్రి ప్రారంభోత్సవం నిమిత్తం అక్కడికి వెళ్లిన చంద్రబాబును, హెలిప్యాడ్ వద్ద  ముస్తఫా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అంతకుముందు, టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుతో కలిసి ఆయన కారులో ముస్తఫా అక్కడికి వెళ్లడం చర్చనీయాంశమైంది.

 కాగా, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మద్దలి గిరిధరరావుపై ముస్తఫా విజయం సాధించారు. వైసీపీకి ముస్తఫా గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. తాజాగా, రాయపాటి కారులో వెళ్లి చంద్రబాబును ముస్తఫా కలవడంతో వైసీపీని ఆయన వీడనున్నారనే వార్తలు బలపడుతున్నాయి. ఈ విషయమై ముస్తఫా స్పందిస్తూ, నియోజకవర్గ అభివృద్ధి కోసమే చంద్రబాబును కలవడం జరిగిందని, నియోజకవర్గ అభివృద్ధికి రూ.2 కోట్లు ఇచ్చేందుకు ఆయన సుముఖత చూపారని అన్నారు. తన నియోజకవర్గానికి వచ్చిన ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశానే తప్ప, ఎట్టిపరిస్థితుల్లోనూ తన పార్టీని వీడనని, వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Chandrababu
rayapati
Telugudesam
YSRCP
mustafa

More Telugu News