దాణా స్కాం మూడో కేసులో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష!

  • దాణా స్కాం మూడో కేసులో వెలువడిన తీర్పు
  • లాలూ, మిశ్రాలకు జైలు శిక్ష, జరిమానా
  • దారి మళ్లిన రూ. 33.67 కోట్లు
దాణా కుంభకోణం మూడో కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాలకు చెరో ఐదేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. దీంతోపాటు చెరో రూ. 5 లక్షల జరిమానా విధించింది. రెండో దాణా స్కామ్ కేసులో లాలూ ఇప్పటికే జైలు జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. లాలూపై ఉన్న మరో రెండు కేసులకు సంబంధించి తీర్పు కొన్ని నెలల వ్యవధిలో వెలువడనున్నాయి.

లాలూ ప్రసాద్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1990-1997 మధ్య కాలంలో ఈ దాణా కుంభకోణం చోటు చేసుకుంది. రూ. 970 కోట్లకు పైగా నిధులను ఈ కుంభకోణంలో కొల్లగొట్టారు. ఈ రోజు తీర్పు వెలువడిన కేసు రూ. 33.67 కోట్లకు సంబంధించినది. 1992-93లో జరిగిన ఈ స్కాంలో దాణా కోసం రూ. 7.10 లక్షల కేటాయింపులు జరిగితే ఏకంగా రూ. 33.67 కోట్లను పక్కదోవ పట్టించారు. ఈ కేసులో లాలూను ప్రథమ ముద్దాయిగా సీబీఐ పేర్కొంది. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉన్న స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జ్ ఎస్ఎస్ ప్రసాద్ ఈ తీర్పును వెలువరించారు.  

ఈ కేసులో మొత్తం 76 మందిపై కేసు బుక్ చేశారు. వీరిలో విచారణ సమయంలో 14 మంది చనిపోయారు. ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. ఇద్దరికి శిక్ష పడగా, ఒకరు పరారీలో ఉన్నారు. విచారణ ఎదుర్కొన్న మిగిలిన 56 మందిలో ఆరుగులు రాజకీయ నేతలు, ముగ్గురు మాజీ ఐఏఎస్ అధికారులు, ఆరుగురు పశుసంవర్ధక శాఖ అధికారులు, ఒక ట్రెజరీ అధికారి, 40 మంది దాణా సరఫరాదారులు ఉన్నారు.
Go Back to Shorts
lalu prasad yadav
jagannath mishra
fodder case
fodder case verdict

More Telugu News