ఆర్డినెన్సు అమలయ్యే విధంగా కృషి చేస్తా: 'ఫాతిమా' విద్యార్థులకు పవన్ కల్యాణ్ హామీ

  • ఫాతిమా కాలేజీ విద్యార్థుల‌ స‌మ‌స్య‌
  • ఆర్డినెన్స్ తీసుకురావ‌డానికి ఏపీ స‌ర్కారు ప్ర‌య‌త్నాలు
  • ప‌వ‌న్‌ను క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన‌ ఫాతిమా కాలేజీ విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు
మూడేళ్ల‌ నుంచి అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నందుకు ఫాతిమా కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ రోజు జనసేన అధ్యక్షుడు, సినీన‌టుడు పవన్ కల్యాణ్‌ని కలసి కృతజ్ఞతలు తెలిపారు. వారు హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనను కలిశార‌ని ఆ పార్టీ ప్రెస్‌నోట్ ద్వారా తెలిపింది.

తనను కలసిన వారితో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. న్యాయం తప్పక విజయం సాధిస్తుందని అన్నార‌ని, విద్యార్థుల సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేవరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే ఫాతిమా విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం తీసుకొస్తున్న‌ ఆర్డినెన్సు అమలయ్యే విధంగా కృషి చేస్తానని ప‌వ‌న్‌ చెప్పారని తెలిపింది.
ఫాతిమా మెడికల్ కళాశాలకు 2015 విద్యా సంవత్సరానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వంద మంది విద్యార్థులు రోడ్డున పడిన సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయమని మూడేళ్లుగా ప్రయత్నం చేసి నిరాశ, నిస్పృహలకు గురైన విద్యార్థులు ఇటీవల ప‌వన్ కల్యాణ్‌ను కలసి విజ్ఞప్తి చేయ‌డంతో, ఆయన విద్యార్థులకు బాసటగా నిలిచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ఈ సమస్యపై మాట్లాడుతున్నారని జ‌న‌సేన ప్రెస్‌నోట్‌లో పేర్కొంది. కాగా, ఇటీవ‌లే చంద్రబాబు నాయుడి ప్రభుత్వం దీనిపై ఆర్డినెన్సును విడుదల చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. 
Go Back to Shorts
fathima college
Andhra Pradesh
Pawan Kalyan

More Telugu News