తెలంగాణలో భారీ ఎన్ కౌంటర్... ఎనిమిది మంది మావోలను హతమార్చిన పోలీసులు!

  • టేకులపల్లి మండలంలో ఘటన
  • కూంబింగ్ దళాలకు ఎదురైన మావోలు
  • అజ్ఞాత దళానికి చెందిన సభ్యులు మృతి
తెలంగాణలోని కొత్తగూడెం - భద్రాద్రి జిల్లా పరిధిలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మావోలు  హతమయ్యారు. ప్రస్తుతం అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం, టేకులపల్లి మండలం బోడు, కొమరారం పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ప్రాంతంలో మావోలు ఉన్నారన్న సమాచారాన్ని అందుకున్న గ్రేహౌండ్స్ పోలీసు దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా, వారికి మావోలు తారసపడ్డారు. వారిని లొంగిపోవాలని హెచ్చరించినా వినలేదు.

మావోల వైపు నుంచి ఫైరింగ్ మొదలు కావడంతో, కూంబింగ్ దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్ కౌంటర్ లో సీపీ బాటకు చెందిన అజ్ఞాత దళ సభ్యులు ఎనిమిది మంది మృతి చెందారు. ఘటనా స్థలి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నామని, వీరు ఎవరన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఎన్ కౌంటర్ పై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Go Back to Shorts
Encounter
Telangana
Kothagudem

More Telugu News