Virat Kohli: గవాస్కర్ రికార్డు బద్దలు.. కెప్టెన్ కోహ్లీ ఖాతాలో మరోటి!

  • 39 ఏళ్ల రికార్డు బద్దలు
  • కెప్టెన్‌గా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 293 పరుగులు చేసిన కోహ్లీ
  • ఒకే మ్యాచ్‌లో ‘డబుల్’, అర్ధ సెంచరీ నమోదు చేసిన ఏడో ఆటగాడిగానూ విరాట్ రికార్డు
విరాట్ కోహ్లీ ఖాతాలోకి మరో రికార్డు వచ్చి చేరింది. ఢిల్లీలో భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 243, రెండో ఇన్నింగ్స్‌లో 50 పరుగులు చేసిన కోహ్లీ 39 ఏళ్లపాటు భద్రంగా ఉన్న రికార్డును బద్దలుగొట్టాడు. కెప్టెన్‌గా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 293 పరుగులు చేసిన టీమిండియా ‘రన్ మెషీన్’ 289 పరుగులతో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న సునీల్ గవాస్కర్‌ను వెనక్కి నెట్టేశాడు. గవాస్కర్ 1978లో విండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 107, రెండో ఇన్నింగ్స్‌లో 182 పరుగులు చేసి మొత్తంగా 289 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో ఓ డబుల్ సెంచరీ, అర్ధ సెంచరీ బాదిన కోహ్లీ మరో రికార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ రెండు నమోదు చేసిన ఏడో కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. ఆయనకు ముందు మార్క్ టేలర్, గ్రాహం గూచ్, గ్రేమ్ స్మిత్, స్టీఫెన్ ఫ్లెమింగ్, రికీ పాంటింగ్, సునీల్ గవాస్కర్‌లు ఈ ఘనత సాధించారు.

More Telugu News

Virat Kohli
Sunil Gavaskar
Cricket