బ్యాంకు ఖాతాల్లో నగదు ఉందా..? ఇలా.. పెట్టుబడికి మళ్లించండి!

పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా ప్రజల వద్దనున్న ధనమంతా బ్యాంకు ఖాతాల్లోకి వచ్చి చేరింది. తమ ఖాతాలలో ఉన్న నగదును ఇప్పుడు ఏం చేయాలి...? అన్న ప్రశ్న అందర్లోనూ ఉదయించడం సహజం. అలానే ఉంచడం కంటే ఇన్వెస్ట్ మెంట్ వైపు మళ్లించడం మంచి చర్య.

నగదు నిల్వలు... వృథాగా ఉండరాదు

బ్యాంకు ఖాతాలో ఒక రోజుకు మించి ఉన్న ధనం ఎక్సేస్సే. దీనిపై 4 శాతానికి మించి కూడా వడ్డీ రాదు. అందుకే నెలవారీ ఆర్జనలో ఖర్చులు పోను మిగిలినది బ్యాంకు ఖాతాల్లో అట్టి పెట్టడం అవివేకం అవుతుంది. కనుక నెలవారీ ఖర్చులకు సరిపడా డిజిటల్ వ్యాలెట్ కు పంపాలి. మరో 15 రోజుల అవసరాలకు సరిపడా నగదును బ్యాంకు ఖాతాలో ఉంచుకోగా మిగిలిన ధనాన్ని ఇతర మార్గాల వైపు మళ్లించాలి.

ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం...representative image

భవిష్యత్తు కోసం నెలవారీ ఆర్జనలో కొంత కేటాయించాలి. వచ్చే ఐదేళ్ల కాలం పాటు ఈ డబ్బులతో పని పడదనుకుంటే ఈ మొత్తాన్ని ఈక్విటీల్లోకి మళ్లించాలి. ఎందుకంటే, ఈక్విటీలను మించి రాబడులను ఇచ్చే సాధనం మరేదీ లేదు. బీఎస్ఈ సెన్సెక్స్ గత 20 ఏళ్ల కాలంలో ఏటా సగటున 10 శాతం రాబడులను ఇచ్చింది. 1995లో ఒక లక్ష రూపాయాలను పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పటికి రూ.6.7 లక్షలు అయ్యేది. ఇది కేవలం సెన్సెక్స్ ఆధారంగా లెక్క వేస్తున్నది. కొన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 10 ఏళ్ల సగటు రాబడులు 20 శాతంపైనే ఉన్నాయి. ఆ లెక్కన చూసుకుంటే పైన చెప్పిన దానికి రెట్టింపు మొత్తం రాబడి వచ్చి ఉంటుంది.

ఏడాది నుంచి ఐదేళ్ల కాలంలో...

ఏడాది లోపు అవసరం పడని నగదు నిల్వలు, ఏడాది తర్వాత ఐదేళ్లలోపు అవసరం పడతాయని అనుకుంటే రిస్క్ తక్కువగా ఉండే సాధనాల్లో పెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనువైనవి. అలాగే ఈక్విటీ బ్యాలన్స్ ఫండ్స్ లో కూడా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫిక్స్ డ్ డిపాజిట్ల కంటే వీటిలో రాబడులు ఎక్కువగా ఉంటాయి. లిక్విడిటీ ఎక్కువ. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు.

ఏడాది లోపు అవసరం ఉంటే...

కొంత మంది రెండు మూడు నెలలో, ఆరు నెలల తర్వాతో అవసరం ఉంది కదా అని పెద్ద మొత్తాలను బ్యాంకు ఖాతాల్లో ఉంచుకుంటారు. కానీ ఇది సరైనది కాదు. దీనికి బదులు అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ కు మళ్లించాలి. బ్యాంకు ఖాతాల్లో 4 శాతం వడ్డీ వస్తుంది. ద్రవ్యోల్బణం కంటే రాబడి తక్కువ, దీంతో డబ్బు విలువ క్షీణిస్తుంది. అదే లిక్విడ్ ఫండ్స్ అయితే, ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ రాబడులను ఇస్తాయి. లిక్విడ్ ఫండ్స్ లో ఉన్న సౌలభ్యం ఏమిటంటే అవసరమైనప్పుడు తక్షణం నగదు చేసుకోవచ్చు. ఐఎంపీఎస్ సౌకర్యం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. ఏటీఎం నుంచి కూడా డ్రా చేసుకోవచ్చు. కాకపోతే మంచి ట్రాక్ రికార్డు ఉన్న అస్సెట్ మేనేజ్ మెంట్ కంపెనీని ఎంచుకోవాలి.

స్వీప్ ఇన్ సేవింగ్స్ అకౌంట్స్

కొంత మంది నగదు మేనేజ్ మెంట్ పెద్ద తలనొప్పిగా భావిస్తారు. అందుకే బ్యాంకు ఖాతాల్లో ఉంచుకుంటుంటారు. లిక్విడ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ మెంట్, దరఖాస్తు ప్రక్రియ ఇదంతా ప్రయాసగా భావిస్తారు. ఇలా అనుకునే వారు కనీసం వారి సేవింగ్ ఖాతాను స్వీప్ ఇన్ కు మార్చేయడం మంచిది. అంటే ఖాతాలో నిబంధనల ప్రకారం ఉండాల్సిన కనీస నగదు నిల్వకు మించి ఎంత ఉంటే ఆ మొత్తం ఆటోమేటిక్ గా ఫిక్స్ డ్ డిపాజిట్ గా మారిపోతుంది. కానీ బ్లాక్ అవదు. అంటే ఎప్పుడు అవసరం అయితే అప్పుడు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, చెక్ ల ద్వారా డిపాజిట్ అయిన మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీనిపై 7 శాతం వడ్డీ లభిస్తుంది.

ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్

ప్రస్తుతం ఎవరి పర్సు చూసినా వెలవెలబోతోంది. బ్యాంకుల నుంచి తెచ్చుకుంటున్న కొద్ది మొత్తం కనీస అవసరాలకే ఖర్చు చేస్తున్నాం... ఈ క్రమంలో బ్యాంకు ఖాతాలోని నగదును ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న దానిపై ప్రణాళిక మేరకు వెళ్లాలి. అత్యవసర ఖర్చులు, పెట్టుబడులు, బిల్లుల చెల్లింపుల్లో వైఫల్యం లేకుండా చూసుకోవాలి. వినోదం, దుబారా ఖర్చులను పక్కన పెట్టాలి. నిజానికి ఖర్చు విషయంలో క్రమశిక్షణకు పెద్ద నోట్ల రద్దు సమయం ఓ మంచి అవకాశం. మరీ ముఖ్యంగా నగదుకు కొరత ఉందని నెలవారీ పెట్టుబడులకు వెళ్లాల్సిన మొత్తాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేయవద్దు. కేవలం ఖర్చులకే కళ్లేం వేయాలి.

పిల్లలకు కిడ్డీ బ్యాంకుrepresentative image

పిల్లలకు కిడ్డీ బ్యాంకు కొనిచ్చి రోజువారీ ఇంత చొప్పున చిల్లర అందులో వేయడం వల్ల పెద్దవారికి కూడా ప్రయోజనం ఉంటుంది. చిల్లరకు కటకట ఏర్పడిన సమయాల్లో ఈ కిడ్డీ బ్యాంకులో చిల్లర అక్కరకు వస్తుంది. పైగా పిల్లల పేరిట కొంత పొదుపు చేసినట్టు కూడా అవుతుంది. దాంతో పిల్లలకు కావాల్సిన వాటిని కొనివ్వవచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లలకూ పొదుపు గురించి తెలుస్తుంది.


More Articles