పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం.. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని, గంగాజమునా తహజీబ్ మరింతగా పరిఢవిల్లాలని, సోదరభావ స్ఫూర్తి గొప్పగా బలపడాలని అభిలషించారు.

ప్రభుత్వం మత సామరస్యం కోసం అహర్నిశలు కృషి చేస్తూ, అన్ని మతాలకు సమాన గౌరవాన్నిస్తున్నదని, ఆ దిశగా రంజాన్ పర్వదినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు. కరోనా తిరిగి ప్రబలుతున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను అనుసరించి ప్రార్థనలు చేసుకోవాల్సిందిగా కోరారు.

ఆర్ధికంగా వెనకబడిన ముస్లింలకు ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. 'షాదీ ముబారక్' ద్వారా ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు పేదింటి ముస్లిం ఆడపిల్లల జీవితాలల్లో గుణాత్మక మార్పుకు దోహదపడుతుండడం గొప్ప విషయమన్నారు.

ముస్లిం మైనారిటీ బిడ్డల చదువుల కోసం అమలు పరుస్తున్న వివిధ పథకాలు విజయవంతమయ్యాయని సీఎం తెలిపారు. అన్ని రంగాల్లో ముస్లింల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, వారి జీవితాల్లో గుణాత్మక అభివృద్ధికి బాటలు వేస్తుండడం పట్ల సీఎం సంతృప్తిని వ్యక్తం చేశారు.

More Press News