"గేదెల రాజు" విజయం సాధించాలి: వీవీ వినాయక్‌

రఘుకుంచే టైటిల్‌ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా సినిమా ట్యాగ్‌లైన్‌. రఘుకుంచే తో పాటు రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్వావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి తదితరులు నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మోటూరి టాకీస్‌ పతాకంపై రఘు కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. వాణి రవికుమార్‌ మోటూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకులు వీ వీ వినాయక్, వీఎన్ ఆదిత్య, నిర్మాత, రైటర్ కోన వెంకట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా

డైరెక్టర్ వీ వినాయక్ మాట్లాడుతూ - రఘు కుంచె ఇండస్ట్రీలో అందరికీ మిత్రుడు. ఎంతోమంది స్నేహితులను సంపాదించుకున్నాడు. మా కన్నా ఇండస్ట్రీకి ముందు వచ్చాడు. ఆర్టిస్టుగా, హీరోగా ప్రయత్నించాడు. మ్యుజీషియన్ గా , సింగర్ గా పేరు తెచ్చుకున్నాడు. సోలో హీరోగా నటించాలనే ఆయన కల ఈ చిత్రంతో నెరవేరుతోంది. రిలీజ్ కు మంచి డేట్ దొరికింది. సినిమా నచ్చి మైత్రీ లాంటి సంస్థ రిలీజ్ చేయడమే ఈ సినిమాకు మొదటి విజయం. రఘు కుంచె క్యారెక్టర్ నే టైటిల్ గా పెట్టి ఎంతో ప్యాషనేట్ గా చేశారు. ఈ సినిమా విజయం సాధించి రఘుకు గొప్ప పేరు తీసుకురావాలని కోరుతున్నా. అలాగే దర్శకుడు చైతన్యకు సక్సెస్ దక్కి, పెద్ద దర్శకుడు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అన్నారు.


దర్శకుల సంఘం ప్రెసిడెంట్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ - గేదెలరాజు సినిమా ట్రైలర్ నాకు బాగా నచ్చింది. రఘు కుంచె గారు మంచి నటుడు. ఆయన సినిమాలు సెన్సార్ లో చూసి ఫోన్ చేసే అభినందించేవాడిని. రఘు గారి మొహంలో అనేక ఎమోషన్స్ పలుకుతాయి. నటుడిగా ఆయన పెద్ద కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఈ చిత్ర నిర్మాత వాణి గారు తన కొడుకు చైతన్యను డైరెక్టర్ ను చేయడం గొప్ప విషయం. సినిమా ఇండస్ట్రీకి వద్దనే తల్లిదండ్రులను చూస్తుంటాం. కానీ ఆమె తమ సొంత డబ్బులతో కొడుకును దర్శకుడిని చేశారు. ఈ సినిమా పరీక్షలు పూర్తయి హాలీడేస్ వచ్చిన మంచి టైమ్ లో రిలీజ్ అవుతోంది. మైత్రీ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. ఈ చిత్రంలోని పాత్రధారులు అందరికీ గుర్తింపు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత రవికుమార్ మాట్లాడుతూ - ఇండస్ట్రీలో పేరున్న పెద్దలతో కలిసి ఈ వేదిక పంచుకోవడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం మా అబ్బాయి చైతన్య వల్లే మాకు కలిగింది. నా శ్రీమతి మా ఇంటికి మూలస్తంభం. ఆమె సపోర్ట్ తోనే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయగలిగాను. రఘు కుంచె గారు ఒక సోదరుడిలా మాకు సహకారం అందించారు. ఈ సినిమా మంచి విజయం సాధించి మాకు పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను. అన్నారు.


దర్శకుడు చైతన్య మోటూరి మాట్లాడుతూ - గేదెలరాజు సినిమాతో కొత్త వాళ్లను, నాకు తెలిసిన వాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాను. మా మూవీ ఇంత పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ జరుపుకుని, గ్రాండ్ రిలీజ్ కు వస్తుందని ఊహించలేదు. ఈ రోజు ఇంతమంది పెద్దలు మా సినిమాకు సపోర్ట్ చేసేందుకు అతిథులుగా రావడం సంతోషంగా ఉంది. నా లైఫ్ లో రఘు గారిని కలవడం పెద్ద అదృష్టంగా భావిస్తాను. ఆయన మా సినిమాకు ఎంత సపోర్ట్ చేశారో మా టీమ్ లోని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ నెల 24న మీ ముందుకు వస్తున్నాం. మా గేదెలరాజు చిత్రాన్ని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.


యాక్టర్ రఘు కుంచె మాట్లాడుతూ - కళారంగమైన సినిమా ఇండస్ట్రీకి తమ వారసులు వెళ్లాలని కోరుకునే తల్లిదండ్రులు చాలా తక్కుమంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎవరికీ గ్యారెంటీ ఉండదు. ప్రతి శుక్రవారం జీవితాలు మారిపోతుంటాయి. పైకి ఎదిగినవాళ్లు కిందపడటం, కిందనున్న వాళ్లు పైకి వెళ్లడం చూస్తుంటాం. మా డైరెక్టర్ చైతన్య పేరెంట్స్ మాత్రం అతన్ని చిత్ర పరిశ్రమకు తీసుకొచ్చారు. నేను చిన్నప్పుడు చదువుకున్న భగవద్గీత శ్లోకం ఒకటి బాగా గుర్తుంది. జీవితంలో ప్రతిరోజూ మనం కురుక్షేత్ర యుద్ధం చేయాల్సిందే. గెలిస్తే రాజభోగం ఓడిపోతే వీరస్వర్గం. ఈ రెండే ఉంటాయి. అలాగని మనం యుద్ధం చేయకుండా ఉండొద్దు. మన సినిమా ఇండస్ట్రీ పద్మవ్యూహం లాంటిది. ఇందులోకి రావడమే గానీ బయటకు వెళ్లడం ఉండదు. ఏది ఏమైనా ఇక్కడే ఉండి ప్రయత్నాలు చేస్తుంటాం. అలా సినిమా ఇండస్ట్రీ అనే పద్మవ్యూహంలోకి అభిమన్యుడిలా వచ్చిన దర్శకుడు మా చైతన్య మోటూరి గెలవాలని, మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. 

ఆయన తల్లిదండ్రులు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో, ఎన్ని ఆశలు పెట్టుకున్నారో చెప్పాలంటే ఒక పుస్తకం రాయాలి. ఈ శుక్రవారం వారు కోరుకున్న ప్రతిఫలం దక్కాలని ఆశిస్తున్నా. మా సినిమా గురించి చెప్పాలంటే దాదాపు అందరం కొత్తవాళ్లమే. కొత్త వాళ్ల సినిమాలో చూసేందుకు ఏముందని మీరు అనుకోవచ్చు. ఈ మూవీలో ఒక మంచి కథ ఉంది. అది మన నేటివిటీ ఉన్న కథ. కాకినాడ అనే పట్టణంలో ఉండే ఒక రౌడీ, అతని క్యారెక్టర్ చుట్టూ అల్లుకున్న కథ. గేదెలరాజు చుట్టూ ఉన్న అనేక కథలు ఆకట్టుకుంటాయి. సినిమా చివరి 20 నిమిషాల్లో అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది. మొదటి నుంచి సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఊహించని ట్విస్ట్ అది. ఆ ట్విస్ట్ కు వచ్చే సర్ ప్రైజింగ్ రియాక్షన్ సినిమాను కాపాడుతుందని నమ్ముతున్నాను. మైత్రీ సంస్థ వందకుపైగా స్క్రీన్స్ లో మా సినిమాను రిలీజ్ చేస్తోంది. ఎగ్జిబిటర్స్ మీ సినిమాను అడుగుతున్నారు అని మైత్రీ శశి గారు అనడం సంతోషాన్నిచ్చింది. మీరు సినిమా చూస్తే తప్పకుండా మరికొందరికి బాగుందని చెబుతారు. అన్నారు.




More Press Releases