గాజియాబాద్లో ఎన్కౌంటర్.. సూర్యప్రతాప్ హత్య కేసు నిందితుడి హతం
- 17 ఏళ్ల సూర్యప్రతాప్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అసద్
- కాల్పుల్లో ఒక కానిస్టేబుల్కు గాయాలు, మరో నిందితుడి పరారీ
- అసద్పై రూ. 50,000 రివార్డు
- బక్రీద్ రోజున సూర్యప్రతాప్ హత్య
ఈ నెల 28న బక్రీద్ పండుగ రోజున ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యప్రతాప్ చౌహాన్ను అసద్, అతడి అనుచరులు కత్తులతో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితులను వెంటనే పట్టుకోవాలంటూ పలు హిందూ సంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ కేసులో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ముగ్గురిని వెంటనే అరెస్ట్ చేశారు. అయితే, ప్రధాన సూత్రధారి అయిన అసద్ పరారీలో ఉండటంతో అతడిపై రూ. 50,000 రివార్డు ప్రకటించారు.
ఈ క్రమంలో అసద్ నగరం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఖోడా, ఇందిరాపురం పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. బైక్పై వస్తున్న అసద్ను ఆపేందుకు ప్రయత్నించగా, అతడు పోలీసులపై నాటు పిస్టల్తో కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అసద్ ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరగలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటన సమయంలో బైక్పై ఉన్న అతని అనుచరుడు చీకటిని ఆసరాగా చేసుకొని పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటనా స్థలం నుంచి ఒక మోటార్సైకిల్, నాటు పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.