బెంగాల్లో అటవిక పాలనకు చెక్.. ఎన్నికల ఫలితాలపై మంత్రి సత్యకుమార్ హర్షం!
- విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో సంబరాలు
- కేరళలో బీజేపీ ఓట్ షేర్ పెరిగిందన్న సత్యకుమార్
- అభివృద్ధి సంక్షేమ పథకాలే ఈ విజయానికి కారణమన్న మంత్రి
దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బెంగాల్, అసోంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ఆధిక్యంపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాల్లో పాల్గొన్న ఆయన, ఈ ఫలితాలను 'చారిత్రక తీర్పు'గా అభివర్ణించారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ప్రజలు అటవిక పాలనకు చరమగీతం పాడుతూ స్పష్టమైన తీర్పునిచ్చారని, అసోంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తోందని పేర్కొన్నారు. కేరళలో బీజేపీ ఓట్ షేర్ గణనీయంగా పెరగడం దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ సమీకరణాలకు నిదర్శనమని ఆయన విశ్లేషించారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు బీజేపీని ఎదుర్కోవడానికి చేతులు కలిపినప్పటికీ, ప్రజలు మాత్రం 'సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్' నినాదానికే పట్టం కట్టారని సత్యకుమార్ తెలిపారు. గత 12 ఏళ్లుగా ప్రధాని మోదీ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఈ విజయాలకు వెన్నెముక అని పేర్కొన్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ విషయంలో 'డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్' (గుర్తించడం, తొలగించడం, బహిష్కరించడం) దిశగా బీజేపీ అడుగులు వేయడం ఆ రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని మంత్రి స్పష్టం చేశారు.