మమతా బెనర్జీ హింసాత్మక రాజకీయాల ఆట ముగిసింది: నవనీత్ కౌర్
- పశ్చిమ బెంగాలో ముగిసిన మమతా బెనర్జీ శకం
- ఇకపై అక్కడ అభివృద్ది పర్వం ప్రారంభమవుతుందన్న నవనీత్ కౌర్
- బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వారు తిరిగి వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమయిందని వ్యాఖ్య
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సాధిస్తున్న భారీ ఆధిక్యంపై ఎంపీ నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శనాస్త్రాలు సంధించారు. మమత గతంలో ఇచ్చిన 'ఖేలా హోబే' నినాదాన్ని ప్రస్తావిస్తూ.. బెంగాల్లో దీదీ ఆడిన హింసాత్మక రాజకీయాల ఆట ముగిసిందని (ఖేలా ఖతం), ఇకపై అక్కడ అభివృద్ధి (వికాస్) పర్వం ప్రారంభమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు.
టీఎంసీ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని... అవినీతి, మహిళలపై అకృత్యాలు పెరిగిపోయాయని ఆరోపించిన ఆమె, ఆ నియంతృత్వ వైఖరికి ప్రజలు ఇచ్చిన సమాధానం ఈ ఫలితాలే అని పేర్కొన్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి జరిగిన అక్రమ వలసలను ఉద్దేశించి మాట్లాడుతూ, వారంతా తిరిగి వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ నాయకత్వంపై బెంగాల్ ప్రజలకు కలిగిన నమ్మకమే ఈ విజయానికి కారణమని నవనీత్ కౌర్ హర్షం వ్యక్తం చేశారు. బెంగాల్ ఓటర్లు మార్పును కోరుకున్నారని, ఈ ఫలితాలు ప్రజాస్వామ్య విజయమని ఆమె స్పష్టం చేశారు.