తెలంగాణలో పెట్రోల్ కష్టాలు.. బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు

Fuel Shortage At Petrol Pumps in Telangana
  • రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారుల ఇక్కట్లు
  • పలు బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు, గంటల తరబడి క్యూలు
  • ధరల పెంపు కోసమే కంపెనీలు కృత్రిమ కొరత అంటున్న డీలర్లు
  • ఏపీ ప్రభావం, వదంతులే కారణమన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం రాత్రి నుంచి పలు పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు వెలిశాయి. దీంతో సోమవారం ఉదయం నుంచి వాహనదారులు ఇంధనం కోసం బంకుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

హైదరాబాద్ సహా హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్ వంటి అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇంధనం ఉన్న కొద్ది బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. కొన్నిచోట్ల టోకెన్లు ఇచ్చి పరిమితంగా పెట్రోల్ పంపిణీ చేయగా, మరికొన్ని చోట్ల ద్విచక్ర వాహనాలకు రూ.500, కార్లకు రూ.2000 చొప్పున కోటా విధించారు. వరి కోతల సీజన్ కావడంతో డీజిల్ కొరత రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

ముందస్తుగా డబ్బులు చెల్లించినా ఆయిల్ కంపెనీలు సకాలంలో సరఫరా చేయడం లేదని పెట్రోల్ బంకుల డీలర్లు ఆరోపిస్తున్నారు. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయనే ప్రచారంతో, ఎక్కువ లాభం కోసం కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని వారు విమర్శిస్తున్నారు.

అయితే ఈ వాదనను రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. రాష్ట్రంలో ఇంధన కొరత లేదని, ఇది కేవలం తాత్కాలిక ఒత్తిడి మాత్రమేనని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కొరత కారణంగా సరిహద్దు జిల్లాలపై భారం పడటం, ధరలు పెరుగుతాయనే వదంతులతో ప్రజలు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన వివరించారు.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో మాట్లాడామని, సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించామని మంత్రి తెలిపారు. సోమవారం సాయంత్రానికి పెండింగ్‌లో ఉన్న ఇండెంట్లు క్లియర్ చేయాలని సూచించినట్లు చెప్పారు. మంగళవారం నాటికి పరిస్థితి చక్కబడుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఇంధనాన్ని నిల్వ చేసినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Go Back to Shorts
Telangana
Fuel
Petrol
Diesel
Petrol Pumps
Shortage

More Telugu News