Chandrababu Naidu: చంద్రబాబుతో సంజయ్ దత్ భేటీ.. ఏపీలో ఫిల్మ్ సిటీ, షూటింగ్లపై కీలక చర్చలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. బాలీవుడ్ దిగ్గజ నటుడు సంజయ్ దత్, తన బృందంతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలోని సీఎం ఛాంబర్లో జరిగిన ఈ సమావేశం జరిగింది. సంజయ్ దత్తో పాటు గౌరవ్ దూబే, కునాల్ పటేల్, అనుజ్ కుమార్ వంటి ప్రముఖులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, సంజయ్ దత్ కాసేపు ఏకాంతంగా కూడా మాట్లాడుకున్నారు. రాష్ట్రంలో సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సంజయ్ దత్ ముఖ్యమంత్రికి వివరించారు.
అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ఉన్న అవకాశాలను సీఎం వివరించారు. విశాఖపట్నం లాంటి నగరాల్లో బాలీవుడ్ సినిమాల షూటింగ్లకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, సింగిల్ విండో క్లియరెన్స్ విధానంపై సీఎం క్లారిటీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం సినిమా రంగానికి ఇచ్చే ప్రోత్సాహకాలను సంజయ్ దత్ బృందం ఆసక్తిగా అడిగి తెలుసుకుంది.
కేవలం నటుడిగానే కాకుండా, చిత్ర నిర్మాణ రంగంలో కూడా అనుభవం ఉన్న సంజయ్ దత్ బృందాన్ని ఏపీలో స్టూడియోలు లేదా పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆహ్వానించారు.
సినిమా షూటింగ్లకు ఏపీని కేంద్రంగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలు, ఉన్న అవకాశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఫిలిం స్టూడియోలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా ప్రణాళికలు ఉన్నామని సంజయ్ దత్కు ముఖ్యమంత్రి వివరించారు. తద్వారా సినిమా, వినోద రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కలిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి సంజయ్ దత్ను కోరారు.



