Kukatpally Robbery Case: కూకట్‌పల్లిలో కోటి రూపాయల దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

Kukatpally Robbery Case Solved Crore Rupees Recovered
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లి కోటి రూపాయల హవాలా సొమ్ము దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ దోపిడీకి బాధితుడి సహోద్యోగే ప్రధాన సూత్రధారి అని తేల్చారు. లక్నోకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు నిందితులు సహా మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.77.78 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. బహదూర్‌పురాకు చెందిన ఓ సంస్థలో పనిచేస్తున్న మహమ్మద్ అజీముద్దీన్, మహమ్మద్ ఖుస్రూద్దీన్ సోమవారం రాత్రి కూకట్‌పల్లిలో రూ.1 కోటి నగదు తీసుకుని వస్తున్నారు. ఈ విషయం ముందే తెలిసిన ఖుస్రూద్దీన్ తన మిత్రులకు సమాచారం అందించాడు. పథకం ప్రకారం, కూకట్‌పల్లి పిల్లర్ నంబర్ 836 వద్ద ముఠా సభ్యులు వీరి బైక్‌ను అడ్డగించి, కళ్లల్లో కారం చల్లి నగదు సంచితో పరారయ్యారు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఘటనా స్థలంలో నిందితులు వదిలివెళ్లిన హోండా యాక్టివా స్కూటర్ కీలక ఆధారంగా మారింది. కంగారులో కారం పొడి తమ కళ్లల్లోనే పడటంతో సద్దాం అనే నిందితుడు తన స్కూటర్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ స్కూటర్ రిజిస్ట్రేషన్ ఆధారంగా పోలీసులు నిందితుల జాడను గుర్తించారు.

నిందితులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి లక్నో పారిపోతున్నట్లు సమాచారం అందుకున్న ప్రత్యేక బృందాలు.. మహమ్మద్ ఒమర్ షరీఫ్, అబ్దుల్ హమీద్, మహమ్మద్ గౌస్ సద్దామ్‌లను అరెస్ట్ చేశాయి. అనంతరం, ప్రధాన సూత్రధారి అయిన బాధితుడి సహోద్యోగి ఖుస్రూద్దీన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.77.78 లక్షల నగదు, 5 మొబైల్ ఫోన్లు, విమాన టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
Kukatpally Robbery Case
Hyderabad crime
Hawala money
Cyberabad police
Mohammed Khusruddin
Kukatpally
Telangana police
Bahadurpura
Shamshabad Airport
Lucknow

More Telugu News